
బలగం’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనంతిక సనిల్కుమార్ను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం..
ఈ పాత్ర కోసం చిత్ర బృందం సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లను పరిశీలించింది. అయితే, చివరికి అనంతికతో ప్రత్యేకంగా లుక్ టెస్ట్, ఫోటోషూట్ నిర్వహించారు. ఆమె నటన, లుక్స్పై దర్శకుడు వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నారు. ‘బలగం’ తరహాలోనే ఈ సినిమా కూడా గ్రామీణ సంస్కృతి, మానవ సంబంధాల పునాదులపై రూపుదిద్దుకుంటోంది..!!
