
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక తీరప్రాంత సంస్కృతి, జానపద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రేక్షకులకు హృదయానికి హత్తుకునేలా చూపించి ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి ఆయన క్రేజ్ను మరింత పెంచింది. ఇప్పుడు రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది..
ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘లీడర్షిప్ ఇన్ సినిమా’ అవార్డును IFFM యాజమాన్యం ఆయనకు ప్రదానం చేయనుంది. ఈ గౌరవంపై స్పందించిన రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన మూలాలను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడమే తన కథల లక్ష్యమని చెప్పారు..!!
