
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటి సాయిపల్లవి వెండితెరపై విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మారి 2’ చిత్రం, అందులోని ‘రౌడీ బేబీ’ పాట సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధనుష్ తన 55వ చిత్రం కోసం దర్శకుడు రాజ్కుమార్ పెరియసామితో కలిసి పనిచేయనున్న విషయం విదితమే.
ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం సాయిపల్లవిని సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘మారి 2’లో వీరిద్దరి కెమిస్ట్రీకి అద్భుతమైన స్పందన రావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘అమరన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు..!!

