
సినీ కెరీర్కు దాదాపు ముగింపు పలకాలని ఓ దశలో స్టార్ హీరోయిన్ సమంత భావించారట. అనారోగ్య సమస్యలతో ఏడాది పాటు విరామం తీసుకున్న ఆమె.. ఇక నటనకు దూరంగా ఉండాలని అనుకుంది. అయితే ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనపై ఆయన పెట్టుకున్న నమ్మకమే మళ్లీ కెమెరా ముందుకు వచ్చే ధైర్యాన్ని ఇచ్చిందని సమంత తాజాగా వెల్లడించింది. అనారోగ్యంతో షూటింగ్ చేయడం తనకు అంత సౌకర్యంగా అనిపించలేదని సమంత చెప్పింది. తన కోసం చిత్రబృందం ఎదురుచూడటం, వారి సమయం వృథా కావడం ఇష్టం లేకపోయిందని పేర్కొంది.
దీంతో నటనకు బదులుగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే రాజ్ ఆమె నిర్ణయాన్ని మార్చేశాడు. ‘‘ఆయనకు నాపై నాకంటే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. సెట్లో ఆయన ఉండటం నాకు ధైర్యం ఇచ్చింది’’ అని సమంత చెప్పింది. తాను దాదాపు కెరీర్ వదిలేయాలని నిర్ణయించుకున్నానని, ‘సిటాడెల్’ బృందానికి ఈ విషయంపై మెయిల్ కూడా పంపానని వెల్లడించింది. ‘మా ఇంటి బంగారం’లో తొలుత సాయిపల్లవిని అనుకున్నారట. ఆమె నటించేందుకు నిరాకరించడంతో సమంత ఆ ప్రాజెక్టులోకి వచ్చింది. కథలో మంచి సామర్థ్యం ఉందని భావించి అది తెరపైకి రావాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది. సమంతకు 2022లో మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే..!!

