
కాజల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే తల్లి అయిన తర్వాత సినిమాల ఎంపికలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’తో పాటు ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ షూటింగ్లతో బిజీగా ఉన్న కాజల్..తన కొడుకు నీల్ పెద్దయ్యాక తన సినిమాలు చూసి గర్వంగా చెప్పుకునేలా ఉండే స్క్రిప్ట్లను ఎంచుకుంటున్నట్లు తెలిపింది..
కమర్షియల్ అంశాల కంటే బలమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ఇండియా స్టోరీ’లో కాజల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనుది. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. కల్తీ ఆహారం, పురుగుమందుల ప్రభావం నేపథ్యంలో సాగే ఈ కథ విన్నాక..ఒక తల్లిగా తన ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానని కాజల్ పేర్కొంది..!!

