
తనపై వస్తున్న కామెంట్లపై మాట్లాడుతున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఫరియా అబ్దుల్లా ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బోనాల వేడుకల్లో ఆమె పాల్గొనడాన్ని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనను ట్రోల్ చేస్తున్న వారికి ఫరియా అబ్దుల్లా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు..
ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడటమే నిజమైన భక్తి అని ఆమె పేర్కొన్నారు. మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతకడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని ఫరియా అన్నారు. ప్రతి చోటా ఉండే దివ్యమైన వెలుగే దేవుడని పేర్కొన్నారు. అలాంటి విశాలమైన భావనను సంకుచితమైన ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారని ఆమె ప్రశ్నించారు. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటికి ద్వేషంతో స్పందించనని ఫరియా స్పష్టం చేశారు. తనను ద్వేషించే వారికి కూడా ప్రేమను పంచుతానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి..!!

