
బాలీవుడ్తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న యువ నటి, మోడల్ అనన్య రాజ్ (27) కన్నుమూశారు. అయితే ఆమె జులై 15వ తేదీనే మరణించగా, ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత ఆగస్టు 16న అధికారికంగా వెల్లడించారు. ఈ ఆలస్య ప్రకటనతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అనన్య రాజ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె కుటుంబ సభ్యులు ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “చాలా బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మా ప్రియమైన అనన్య జులై 15న తెల్లవారుజామున నిద్రలోనే శాంతంగా కన్నుమూసింది.
గత ఏడాదిగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడింది. ఒక యోధురాలిలా ఎంతో ధైర్యంగా నిలబడింది. ఈ కష్ట సమయంలో మాకు ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి” అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ముంబైలో పుట్టి పెరిగిన అనన్య రాజ్, మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2016లో ‘7 అవర్స్ టు గో’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘ది ఫైనల్ ఎగ్జిట్’, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ నటించిన ‘ఘోస్ట్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’ (2022) చిత్రంతో పాటు ‘మద్రాసీ గ్యాంగ్’ సినిమాలోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు..!!

