
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన పని పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో మరోసారి నిరూపించారు. తన తీరిక లేని పని షెడ్యూల్ గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వరుసగా 20 గంటల పాటు షూటింగ్లో పాల్గొన్నానని, మొత్తం 41 గంటలుగా నిద్ర లేకుండా ఉన్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినప్పటికీ, ఇంత బిజీగా ఉండటాన్ని తాను ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పడం ఆమె వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది..
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కీర్తి సురేశ్ వరుస పోస్టులు పెట్టారు. ఒక వీడియో క్లిప్లో మాట్లాడుతూ, “దాదాపు 24 గంటల తర్వాత ఇప్పుడే నా రూమ్లోకి అడుగుపెట్టాను. సుమారు 20 గంటలు పనిలోనే ఉన్నాను. నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరాను, ఇప్పుడు ఉదయం 6 అవుతోంది. అసలు విషయం ఏంటంటే, మరో గంటలో నేను తర్వాతి పనికి బయలుదేరాలి. అయినా ఇవి మంచి సమస్యలే కదా, ఇదే జీవితం. దీన్ని నేను ఒక వరంగా భావిస్తాను” అని అన్నారు. మరో పోస్టులో, “నిన్న ఈ పోస్ట్ పెట్టేంత శక్తి కూడా లేదు. ఒక షూట్ నుంచి మరో షూట్కు పరుగులు. 41 గంటలు మెలకువగానే ఉన్నాను” అని రాసుకొచ్చారు..!!

