
నలభై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన హవా కొనసాగిస్తోంది త్రిష. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక భారీ ప్రాజెక్టుకు సంతకం చేసి వార్తల్లో నిలిచింది. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ హీరోల కలయికలో రాబోతున్న చిత్రంలో కథానాయికగా ఎంపికై, తన కెరీర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దక్షిణాది చిత్రసీమలో కొన్ని దశాబ్దాల తర్వాత ఇద్దరు అగ్ర నటులు రజినీకాంత్ , కమల్ హాసన్ కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రధాన కథానాయికగా నటించే అరుదైన అవకాశాన్ని త్రిష దక్కించుకుంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. సినిమాలపైనే తన పూర్తి దృష్టి ఉందని ఆమె మరోసారి స్పష్టం చేసింది. ఈ కొత్త చిత్రం కోసం ఆమె ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం..!!

