
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కార్యక్రమం ముగిసిన అనంతరం అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె మరియు శ్రీలీల కలిసి మీడియా ప్రతినిధులకు గ్రూప్ ఫొటోల కోసం పోజులిచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న జర్నలిస్టులు..అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె ఇద్దరే ఉన్న ఫొటోలు కావాలని అడిగారు. దీనికి స్పందించిన అమృత, పక్కనే నిలబడిన శ్రీలీలకు చేత్తో వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాల్సిందిగా కోరారు. ఈ హఠాత్ పరిణామంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్కు గురవడమే కాకుండా, కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతూ పక్కకు తప్పుకోవడం కెమెరాల్లో రికార్డైంది..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. శ్రీలీల అభిమానులు మరియు కొంతమంది నెటిజన్లు అమృతా ఫడణవీస్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక పాపులర్ సెలబ్రిటీ అని కూడా చూడకుండా, అంత మంది మీడియా ప్రతినిధుల ముందు వేలు చూపిస్తూ పక్కకు పొమ్మనడం శ్రీలీలను ఘోరంగా అవమానించడమేనంటూ అమృతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో అమృతా ఫడణవీస్కు మద్దతుగా కూడా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కేవలం మీడియా వారు అడిగిన ఫొటో ఫ్రేమ్ కోసమే ఆమె శ్రీలీలను పక్కకు తప్పుకోమని చాలా సాధారణంగా, గౌరవంగానే కోరారని..అంతేకానీ ఇందులో ఎలాంటి అవమానకరమైన ఉద్దేశం లేదని సమర్థిస్తున్నారు..!!
