
ప్రస్తుతం మోహన్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. జూలై 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో మోహన్ బాబు లుక్, పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా విజయవంతమై, ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే మోహన్ బాబు కెరీర్కు ఇది కీలక మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కూడా మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తే, మరోసారి వరుస అవకాశాలు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న మోహన్ బాబు, ఈ చిత్రాలతో మరోసారి తన నటనకు ఉన్న సత్తాను నిరూపిస్తారా? ఆయన కెరీర్కు ఇవి నిజంగానే టర్నింగ్ పాయింట్ అవుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది..!!
