
హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి రెండేళ్ల వివాహ బంధం ముగిసినట్లయింది..
2022 డిసెంబర్లో హన్సిక, సోహైల్ వివాహం రాజస్థాన్లో అత్యంత వైభవంగా జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది కాలానికే ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా ఖాతాల నుంచి హన్సిక తన పెళ్లి ఫొటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2024 జులై నుంచే వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న తర్వాత హన్సిక-సోహైల్ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా విడాకులను ఖరారు చేసింది..!!

