
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఉత్సాహంగా ఉన్న రష్మిక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025’లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. శనివారం వెలువడిన ఈ ఫలితాల్లో ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రంలోని ఆమె అద్భుత నటనకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు..
“గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కృతజ్ఞురాలిని. ఈ సినిమాలో నేను పోషించిన ‘భూమా దేవి’ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రష్మిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..!!

