
ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు..
గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్ 00’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు..!!

