
కెరీర్లో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న నటి తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక అవకాశం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుల్లో ఒకరైన వి. శాంతారాం జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో ఆమె నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘చిత్రపతి వి. శాంతారాం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ‘నటసామ్రాట్’ చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్పాండే ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. వి. శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో సంధ్య హీరోయిన్గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్లో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి..!!
