
నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కొత్త చిత్రాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన బృందం ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ గారు ఏ కొత్త సినిమా కమిట్మెంట్లు తీసుకోలేదు. ఆయన కొత్త ప్రాజెక్టులపై వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదు..
సరైన సమయంలో ఏ విషయమైనా అధికారికంగా వెల్లడిస్తాం” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్గా భావిస్తున్న ‘ఓజీ2’ అప్డేట్ను స్వయంగా పవన్ కల్యాణే సరైన సమయంలో తెలియజేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత మోహన్ రాజా, దేవ కట్టా వంటి దర్శకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వదంతులకు ఫుల్స్టాప్ పెట్టేందుకు పవన్ టీమ్ ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది..!!
