
అందాల పోటీల్లో సత్తా చాటిన మరో భామ వెండితెరపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేత రియా సింఘా నటిగా తన ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే ప్రారంభించడం విశేషం. కమెడియన్ సత్య హీరోగా, ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జెట్లీ’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ను విడుదల చేసింది..
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రియా సింఘా ఇంటెన్స్ లుక్తో, యాక్షన్కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘శివానీ రాయ్’ అనే పాత్రను పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్ను బట్టి చూస్తే, ఆమె పాత్రకు సినిమాలో యాక్షన్కు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్కు చెందిన రియా సింఘా, 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా-2024 కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు ఏడాది ‘మిస్ టీన్ గుజరాత్’, ‘మిస్ టీన్ ఎర్త్’ టైటిల్స్ను కూడా సొంతం చేసుకున్నారు..!!

