ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో లక్ష్మీ మేనన్!
ప్రముఖ తమిళ నటి, ‘చంద్రముఖి 2‘, ‘ఇంద్రుడు‘, ‘కుంకి‘ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన లక్ష్మీ మీనన్ తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో లక్ష్మీ మీనన్ ప్రధాన నిందితురాలిగా ఉండగా, ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
నటి లక్ష్మీ మేనన్ పై కిడ్నప్ కేసు నమోదు!
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ బార్లో బాధితుడి స్నేహితుడితో లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లక్ష్మీ మీనన్ బృందం బాధితుడిని వెంబడించి, అతని కారును అడ్డగించింది. అనంతరం అతడిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు..!!