బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన పురుషులతో సంబంధాల విషయంలో సమాజం ఎప్పుడూ మహిళలనే దోషిగా చూస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..తన వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలతో పాటు, నేటితరం డేటింగ్ పోకడలపై కూడా ఘాటుగా స్పందించారు..
కెరీర్లో రాణించాలనే తపన ఉన్న యువతులను పెళ్లయి, పిల్లలున్న పురుషులు తమవైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నించినప్పుడు.. సమాజం మొత్తం ఆ అమ్మాయినే వేలెత్తి చూపుతుందని కంగనా అన్నారు. ఇలాంటి సందర్భాల్లో పురుషుడి తప్పును ఎవరూ చూడరని, కేవలం మహిళనే నిందిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. “ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో పెళ్లయిన వ్యక్తి సంబంధం పెట్టుకోవాలని చూస్తే, అది అతని తప్పు కాదా? కానీ నింద మాత్రం అమ్మాయి మీదే వేస్తారు” అని ఆమె పేర్కొన్నారు..!