
హనుమాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్లోని తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ను అధికారికంగా ప్రారంభించారు. కర్ణాటకలోని హంపి సమీపంలో, ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అంజనాద్రి బెట్టపై పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో హనుమంతుడి కీలక పాత్రను ‘కాంతార’ ఫేమ్, జాతీయ అవార్డు గ్రహీత రిషభ్ శెట్టి పోషిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రిషభ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి హాజరయ్యారు. ‘హనుమాన్’ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కు ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా, అనిల్ థడానీ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ అందుకున్న సమయంలో రిషభ్ శెట్టి భక్తిభావంతో కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. 2024 సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘హనుమాన్’కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..!!
